
వికసిత పార్వతీపురమే లక్ష్యం
పార్వతీపురంటౌన్: వికసిత పార్వతీపురం జిల్లాగా రూపుదిద్దడమే లక్ష్యమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ స్పష్టం చేశారు. జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్తో కలిసి అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ సంకల్పం వికసిత్ భారత్–2047 ధ్యేయంగా నిర్వహించే కార్యచరణ ద్వారానే జిల్లా అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
● ఉపాధి హామీ పథకంలో రూ.322.75 కోట్ల చెల్లింపులు జరిగాయి. జల్జీవన్ మిషన్ పథకం కింద 2,313 పనులను రూ. 289.74 కోట్లతో ప్రారంభించి 85,002 గృహాల్లో 46,984 గృహాలకు తాగునీటి కుళాయిలు బిగించాం.
● జిల్లాలో 476 గ్రామాలకు సంబంధించి 428 కిలోమీటర్ల మేర రహదారుల అనుసంధానం కావాలి. పీఎం గ్రామీణ సడక్యోజన కింద 154 గ్రామాలను రహదారులతో అనుసంధానం లక్ష్యం.
● టిడ్కోగృహాలకు సంబంధించి సాలూరులో 1,440 గృహాలకు 1056 గృహాలు, పార్వతీపురంలో 1,104 టిడ్కో గృహాలకు 768 గృహాలను లబ్ధిదారులకు అప్పగించాం.
● పీఎంకుసుమ్ పథకం ద్వారా 115.87 ఎకరాల భూమిని గుర్తించి 25.75 మెగావాట్ల సామర్ధ్యం లక్ష్యంగా పెట్టుకున్నాం.
● పీఎం శ్రీనిధి పథకం ద్వారా జిల్లాలో 148 మందికి సబ్సిడీ రుణాలు మంజూరు చేశాం.
● జిల్లాలో పర్యాటక అభివృద్ధికోసం 11 జలపాతాలను, మూడు రిజర్వాయర్లను గుర్తించామని వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సబ్కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి, డీఆర్ఓ హేమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
20 సూత్రాల అమలపై సమీక్ష సమావేశం