
లైంగికదాడి కేసులో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి పోలీస్స్టేషన్లో 2020వ సంవత్సరంలో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం మహిళాకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎన్.పద్మావతి పదేళ్ల కారాగార శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ..గరుగుబిల్లి మండలం, దళాయివలస గ్రామానికి చెందిన ఫిర్యాదిదారు జీవనోపాధి నిమిత్తం 2017వ సంవత్సరంలో ఆకివీడులోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తూ కంపెనీ హాస్టల్లో ఉంటూ జీవనం సాగిస్తుండగా..అదే సంవత్సరంలో గరుగుబిల్లి మండలం, కొంకడివరం గ్రామానికి చెందిన ముద్దాయి బలగ శివ జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో బాధితురాలిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని అభయమిచ్చి పలుమార్లు శారీరకంగా లోబరుచుకుని మోసం చేశాడన్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2020లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువైన మేరకు విజయనగరం న్యాయస్థానం పైవిధంగా శిక్ష ఖరారు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును సంబంధించి దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.