సాలూరు రూరల్: ఒడిశా ప్రభుత్వం కొటియా గ్రామాల గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించాలని తహసీల్దార్ రమణమూర్తికి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు తాడంగి సన్నం, బాధిత గిరిజనుడు తాడంగి భీమ మాట్లాడుతూ కొటియా గిరిజన గ్రామాల గిరిజనుల భూములను ఆక్రమించి కంచె వేస్తున్న ఒడిశా అధికారులను ఆంధ్రా అధికారులు అడ్డుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పొడు పట్టా భూముల్లో దౌర్జన్యంగా కంచె వేస్తుంటే అడ్డుకున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమపై ఒడిశా అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఆంధ్రా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. కొటియా గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఉగాది కాదు.. ఇది కూటమి దగా!
శృంగవరపుకోట : రానున్న ఉగాది వలంటీర్లకు కూటమి ప్రభుత్వం చేసే దగా.. అని ఏపీ గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ వలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తామని, రూ.10వేల వేతనం ఇస్తామని ఇప్పుడు మాట తప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపొందాక వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్దత లేదని మాట మార్చారన్నారు. కూటమి సర్కారును నిలదీసేందుకు ఈ నెల 30వ తేదీన ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశారన్నారు.
ఒడిశా ఆగడాలపై తహసీల్దార్కు ఫిర్యాదు