కానరాని నల్లజీడి
సీతంపేట: ఒకప్పుడు కొండకోనల్లో ఈ సీజన్లో విస్తృతంగా లభించే నల్లజీడి పిక్కలు ఈ ఏడాది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో గిరిజనుల ప్రధాన ఆదాయనవరుకు నష్టమేర్పడినట్ల యింది. డిసెంబర్ నెలాఖరు నుంచి ఫిబ్రవరి వరకు సీజన్ ఉంటుంది. గడిచిన మూడేళ్లలో వచ్చిన తుఫాన్లకు చెట్లన్నీ పోయాయని, అందుకే దిగుబడులు లేక నష్టాలు చవిచూస్తు న్నామని గిరిజనులు వాపోతున్నారు. గతంలో ఎక్కడ చూసినా ఈ సీజన్లో వారపు సంతల్లో గిరిజన రైతులు నల్ల జీడి పిక్కలు విక్రయించేవారు. సీతంపేట ఏజెన్సీలో ప్రధానంగా కొండపోడులో పండే నల్లజీడి పిక్కలకు ముంబైలో మంచి డిమాండ్ ఉంది. ఈ నల్లజీడిని రంగుల తయారీకి వినియోగిస్తున్నట్లు సమాచారం. గిరిజన సహకార సంస్థ వాటిని విస్తృతంగా కొనుగోలు చేసేది. క్వింటాళ్ల లెక్కన జీసీసీ వివిధ కంపెనీలకు విక్రయించేది. ఇటు జీసీసీకి, అటు గిరిజనులకు ఆదాయం వచ్చేది. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, పొల్ల, కుశిమి వారపు సంతల్లో శనివారం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి జీసీసీ సేల్స్మెన్ వాటిని కొనుగోలు చేసేవారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మాత్రం వాటిని పెద్దగా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. గిరిజన సహకార సంస్థ పూర్తిగా కొనుగోలు చేయడంతో మంచి ఆదాయవనరులు గిరిజనులకు సమకూరేవి. మంచి ధరలు కూడా జీసీసీ ఇచ్చేది. ఈ సంవత్సరం రూ.కిలో 35కు కొనుగోలు చేసేందుకు జీసీసీ నిర్ణయించింది.
నల్లజీడి ఉపయోగమేమిటంటే..
ముంబైలో రంగుల తయారీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో వాటిని రంగుల తయారీకి వినియోగించేవారు. అలాగే కేరళలో నల్లజీడి పిక్కల మధ్యలో ఉన్న పలుకులను తీసేసి ఇష్టంగా అక్కడి ప్రజలు తింటారు. నల్లజీడి నుంచి లోపల పిక్కలను వేరు చేసి కొన్ని సందర్భాల్లో అరకేజీ పలుకులను రూ.200కు గిరిజనులు విక్రయించేవారు. అయితే వాటి లోపల పలుకులను తీయడం చాలా కష్టం. దీనికి సంబంధించిన జీడి చేతికి అంటితే అంతవేగంగా వదలదు. పైగా దురదలు కూడా వచ్చేస్తాయని గిరిజనులు చెబుతున్నారు. అందుకే పలుకులను తీయలేని పరిస్థితిలో జీడి పిక్కలనే విక్రయించే వారమని ఈ సంవత్సరం ఎక్కడా నల్లజీడి పండలేదని గిరిజనులు తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది అన్ని పంటలకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. నల్లజీడిి ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. కొండకోనల్లో తిరిగి సేకరిద్దామన్నా అసలు చెట్లే లేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా ఎంతోకొంత ఆదాయం వచ్చేది. ఎస్.రామన్న, కుమ్మరిగండి
అన్ని పంటల దిగుబడి అలాగే ఉంది. ఒకవేళ పండిన పంటలు తీసుకువచ్చినా అంత గిట్టుబాటు ధరలు కూడా ఉండడం లేదు. గతంలో నల్లజీడి ఎక్కువగా పండేది. మంచి లాభాలు చూసేవాళ్లం. ఈ సంవత్సరం అది కూడా లేదు.
ఎస్.బాపయ్య, జగ్గడుగూడ
ఆదాయం కోల్పోయిన గిరిజన రైతులు
ముంబైలో డిమాండ్ ఉన్నా ఫలితం నిల్
గతంలో గిరిజనులు సేకరించిన నల్లజీడి పిక్కలు (ఫైల్)
కానరాని నల్లజీడి
కానరాని నల్లజీడి


