పెదకూరపాడు: పెదకూరపాడులో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొమ్మలు విరిగిపడ్డాయి. పెదకూరపాడు – అమరావతి రహదారి మధ్య కాలచక్ర రోడ్డుపై పేరమ్మ వాగు, నీరు కుంట వద్ద లో లెవల్ చప్టాపైనుంచి ఉధృతంగా ప్రవహించటంతో రాకపోకలకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. కంభంపాడు వద్ద వాగు ఉధృతంగా ప్రవహించింది. కాలచక్ర రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన హోర్డింగులు విరిగిపడ్డాయి. పత్తి పంట నేలకు ఒరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాటిబండ్ల గ్రామంలో లో తట్టు ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా 102 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. పెదకూరపాడులోని రైతు గురజాల నానికి చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


