జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని నేరుగా పరిశీలించాలని సూచించారు. ప్రజా, అత్యవసర వాహనాల రాకపోకలు, విద్యుత్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు పరిశీలించాక అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, విద్యుద్దీపాల ఏర్పాట్లల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రధాన రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు.
నిఘా పెంచాలి
నిమజ్జన ఊరేగింపు తేదీలు, మార్గాలను ముందుగా సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలు వద్దని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం స్పష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.


