నరసరావుపేట రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం 3గంటలకు పట్టణంలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
9,11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
చిలకలూరిపేటటౌన్: నియోజకవర్గంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ (ఎల్ఈఎస్టీ–2027) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా సమీప మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
యడ్లపాడు: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కొండవీడు కోటకు ఆదివారం సందర్శకులు అధికసంఖ్యలో వచ్చారు. కొత్తపాలెం గ్రామం నుంచి ఘాట్రోడ్డు, కొండపైన పురాతన కట్టడాల వద్ద గుంపులు గుంపులుగా వచ్చి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 35 మంది వెటర్నరీ వైద్యులు కొండవీడును సందర్శించారు. వారంతా సాహస క్రీడలపై ఆసక్తి చూపారు. పల్నాడు జిల్లా అటవీశాఖ, ఔట్రీచ్ ట్రెక్కింగ్ అకాడమీ ఆధ్వర్యంలో కొండలపై ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ యువతతో పాటు వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు. ట్రెక్కింగ్లో భాగంగా కొండవీడు కోట చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకుంటూ, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా సాగిన ట్రెక్కింగ్ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వారితో పాటు కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి, అటవీశాఖ అధికారులు ఉన్నారు.
బావిలో గుర్తు తెలియని
మృతదేహం
పిడుగురాళ్ల: పొలం బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని కామేపల్లి శివారు పొలాల్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. కామేపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో పల్లా నాగయ్య నేలబావిలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం లభించిందన్న స్థానికులు సమాచారం మేరకు.. బావిలోని మృతదేహాన్ని వెలికి తీయటం జరిగిందన్నారు. మృతుడు ఆకుపచ్చ రంగు లుంగీ, తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో ఉంచామని, మృతుడి సంబంధీకులు పట్టణ సీఐ వెంకట్రావు 9440796236, ఎస్ఐ మోహన్ 7207271178 నెంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ మోహన్ తెలిపారు.
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


