యడ్లపాడు: విద్యార్థుల వికాసమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తున్న కొండవీడు జెడ్పీహైస్కూల్ ప్రాంగణంలోని పీఎంశ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ జున్నుసాహెబ్కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత్ గురు రత్న అవార్డు–2026ను ఆదివారం అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా సేవగా భావించే జున్నుమాస్టారు.. సంప్రదాయ బోధనకు భిన్నంగా కృత్యాధార, అనుభవపూర్వక పద్ధతులను అనుసరిస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంచుతూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. కాలిగ్రఫీలో డిప్లొమా చేసిన ఆయన సెలవు రోజుల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల్ని ఏర్పాటు చేసి ఉచిత హ్యాండ్రైటింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్, శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పట్నం కమల మనోహర్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసి ఆయనను ఘనంగా సత్కరించారు.
భారత్ గురురత్న అవార్డు–2026 అందుకున్న డాక్టర్ జున్నుసాహెబ్


