అమరావతి: పంచారామాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలలో రెండవ రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయ అర్చకులు, వేదపండితులు మండప పూజ, దీక్షా హోమం, రుద్ర హోమం, పవిత్రధారణ, చండీ హోమం, దీక్షా హోమం, హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. అనంతరం అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీదేవికి, 18 ఉపాలయములలో పట్టు పవిత్రాలు సమర్పించి రుద్ర, చండీ, విశేష హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అమరేశ్వరునికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. గురువారం ఉదయం పవిత్రోత్సవాలలో ముగింపు సందర్భంగా 11 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ శ్రీ స్వామివారి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.


