డీపీటీఓ కార్యాలయం ఎదుట ధర్నా
నరసరావుపేట: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం గ్యారేజ్ దగ్గర నుంచి డీపీటీఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీపీటీఓ టి.అజితకుమారికి వినతిపత్రం అందజేశారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకరరావు, సింగ్ మాట్లాడుతూ ఏళ్లు, నెలలు గడుస్తున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవట్లేదన్నారు. దీని వలన ఆయా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ తీసుకోకుండానే అనేక మంది రిటైర్డు ఉద్యోగులు మృతిచెందారన్నారు. ఉద్యోగం లేక రావాల్సిన సెటిల్మెంట్ తాలూకా మొత్తాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువలన వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని, రిటైర్డు ఉద్యోగి, ఆయన భార్యకు లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించి పీఎఫ్ కార్యాలయంకు జమచేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని, హైదరాబాదు బర్కత్పురాలో ఉన్న పీఎఫ్ కార్యాలయం నుంచి ఉద్యోగుల ఖాతాలను ఏపీకి తరలించాలని కోరారు. వై.మస్తాన్రావు, ఎం.ఆర్.కే.రెడ్డి, టి.సుబ్బారావు, ఎస్ఎం ఆలీ, వీరారెడ్డి తదితర రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.


