గుంటూరు రూరల్: అందరివారిగా పిలవబడడం.. ఇతరులకు సహాయం చేసే మంచి గుణం.. కొందరికే ఉంటుందని.. ఆ దిశగా అందరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఆదివారం నగర శివారుల్లోని రెడ్డిపాలెంలోగల తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అనవేమా ట్రస్ట్ కార్యదర్శిగా నియమితులైన మున్నంగి సంజీవ రెడ్డిని మోదుగుల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన సేవా దృక్పథంతో ఉడుముల సాంబిరెడ్డి అనవేమా ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్ధుల కోసం అవిరళ కృషి చేశారని, ఆ సంస్థ విలువలు కాపాడతారని, అభివృద్ధికి సంజీవరెడ్డి బాటలు వేస్తారని ఆశిస్తున్నామన్నారు. ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ దుగ్గెంపూడి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ అనవేమా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పేద మధ్యతరగతి విద్యార్థినుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ట్రస్ట్ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, కొల్లిపర సంజీవరెడ్డి, కుర్రి పుల్లారెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీటి డ్రమ్ములో పడి బాలుడు మృతి
పొన్నూరు: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పాస్టిక్ డ్రమ్ములోని నీటిలో పడి ఊపిరి ఆడక బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చింతలపూడి గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ నివాసి, ఉద్యోగరీత్యా ప్రస్తుతం సౌదీలో ఉంటున్న యూసుఫ్ కుమారుడైన హుస్సేన్(4) తోటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో డ్రమ్ములో పడి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. గ్రామంలో ఉత్సవం జరుగుతున్న నేపధ్యంలో చూసేందుకు ఇంటి బయట నిలబడిన తల్లి లోపలికి వచ్చి డ్రమ్ములో మృతి చెందిన బాలుడిని చూసి కన్నీరుమున్నీరయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాజర్ చిన్నారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
పొన్నూరు: స్థానిక షరాఫ్ బజార్లోని ఓ చిరు వ్యాపారి ఇంట్లో చోరీ జరిగి బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొల్లిపర సుబ్బారావు తన నివాసంలోనిపై గదిలో రాత్రి నిద్రించారు. ఈ నేపధ్యంలో కింద ఇంటి గడియ పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి, బీరువా పగలగొట్టి సుమారు 6 సవర్ల బంగారు వస్తువులు, 700 గ్రాముల వెండి దొంగిలించినట్లు తెలిపారు. తెల్లవారుజామున కింద ఇంటిలోకి వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించారు. తన కూతురి వివాహం కోసం బ్యాంకు నుంచి తీసుకువచ్చిన బంగారం, వెండి చోరీకి గురికావడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


