నరసరావుపేట టౌన్: ప్రసవానంతరం తల్లి, శిశువుల సురక్షిత రవాణాకు ఆధునికరించిన హంగులతో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాలలో నూతన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 300 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఆధునిక వాహనాలను ప్రారంభిస్తున్నామని, మరో విడతలో 200 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ వాహనాల్లో ఏసీ సదుపాయంతోపాటు ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రయాణ సమయంలో వాహనంలోని ఆడియో సిస్టమ్ ద్వారా తల్లిపాలు, నవజాత సంరక్షణ, పోషణ, టీకాలు, ప్రసవానంతర జాగ్రత్తలపై ప్రభుత్వ సూచనలు నిరంతరం వినిపిస్తాయని తెలిపారు. ఈ వాహనాలకు మహిళా డ్రైవర్ల నియామకం చేపడతామని చెప్పారు.


