● కరి మబ్బులు ఉన్నా.. వాన జాడ లేదన్నా
● జిల్లాలో జూలై 11న 1.2 మి.మీ. వర్షం
రొంపిచర్ల: జిల్లాలో వర్షాలు దాదాపు ముఖం చాటేశాయి. రోజంతా ఆకాశం మేఘావృతమవటమే తప్పా ఆకాశం నుంచి చినుకు రాలదు. అయితే శనివారం జిల్లాలో వర్షపాత గణాంకాల ప్రకారం బొల్లాపల్లి మండలంలో మాత్రమే 1.2 మిల్లీమీటర్ల స్వల్ప వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని మండలాల్లో వర్షపు జాడలేదు. ఈ నెల ప్రారంభంలో అక్కడక్కడ కురిసిన వర్షాలతో రైతులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వరి, పత్తి, మిర్చి, కందులు తదితర ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా విత్తనాలు వేసిన పొలాల్లో తేమ నిల్వ ఉండేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు అవసరమని రైతులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం జూలై నెలకు సాధారణంగా ఈ నాటికి 46.47 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు నమోదైన వర్షపాతం అంతంత మాత్రమే. జూలై 3న జిల్లాలో అత్యధికంగా 92.6 మి.మీ., 6న 45.4 మి.మీ., 9న 15.2 మి.మీ. 10న 5.4 మి.మీ., జూలై 11న కేవలం 1.2 మి.మీ. మాత్రమే వర్షపాతం నమోదైంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు పనులు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో విసృతంగా వర్షాలు కురిస్తే తప్ప ఖరీఫ్ సాగుకు అనుకూలించే పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు.


