నరసరావుపేట: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 139 అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు ఆమే స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకొన్నారు. పర్కిరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. డీఆర్ఓ అద్దెయ్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, మూడు డివిజన్ల ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నష్టపరిహారం ఇప్పించండి
వేమవరం గ్రామానికి చెందిన మీసాల రామస్వామి మాట్లాడుతూ... 2012లో పులిచింతల ముంపు ప్రాంతంలో తమ కుటుంబానికి చెందిన 9.56 ఎకరాల పొలం, మూడు సెంట్లలోని ఇల్లు ఉండేవన్నారు. 26 మంది ఎస్సీ నిర్వాహసితులకు నష్టపరిహారం మంజూరు చేసినా.. తమకు మాత్రం ఇవ్వలేదన్నారు. అప్పటి నుంచి నష్టపరిహారం కోసం పోరాడుతున్నానని చెప్పారు. వందలసార్లు గుంటూరు, నరసరావుపేట కలెక్టరేట్ల చుట్టూ తిరిగానని వివరించారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన పరిహారం అందజేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
సర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయండి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా ఆదేశించారు. సోమవారం సర్పై అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. సూపర్వైజర్లు, బీఎల్ఓలతో మాట్లాడి ఎన్యూమరేషన్ పత్రాలు ఓటర్ల దగ్గర నుంచి స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ మెరుగుకు చర్యలపై దిశా నిర్దేశం చేశారు. సర్ ప్రక్రియను అత్యంత సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీతో ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సోమవారం నాటికి జిల్లాలో 10,66,501 ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు.


