నరసరావుపేట: పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వామపక్షాల దేశవ్యాప్త పిలుపు మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రాస్తోరోకో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్, మల్లమ్మ సెంటర్ మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. విజయకుమార్ మాట్లాడుతూ... మన రాష్ట్రంలో దొరుకుతున్న గ్యాస్లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, కార్పొరేట్లకు రాయితీలు రద్దు చేసి ప్రజలపై భారం తగ్గించాలన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు ప్రభావం అన్ని వర్గాల ప్రజలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రత్యక్షంగా పడిందని అన్నారు. విభజించు పాలించు అనే తీరులో కేంద్రం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సీపీఎం 1వ, 2వ పట్టణ కార్యదర్శులు షేక్ సిలార్ మసూద్, ఎస్డీ రబ్బాని, నరసరావుపేట మండల కార్యదర్శి డి.శివకుమారి, నాయకులు ఎస్.వెంకటేశ్వరరాజు, టి.పెద్దిరాజు, కె.నాగేశ్వరావు, ఎం.ఆంజనేయులు, కె.ఆంజనేయులు, మస్తాన్వలి, ఖాజావలి, సీపీఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, చిన్న జాన్ సైదా, రైతు సంఘం నాయకుడు నాగేశ్వరరావు, గిరిజన నాయకుడు కోయ శ్రీను, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్.జిలాని మాలిక్ పాల్గొన్నారు.


