● బాఽధితులనే నిందితులుగా
చేర్చటం అన్యాయం
● మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం
చిలకలూరిపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుది అక్రమ అరెస్టు అని, బాధితుడినే నిందితుడిగా చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రెడ్బుక్ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బనాయించిన అక్రమ కేసు విషయమై ఆదివారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్స్టేషన్కు వచ్చి ఆమె సంతకం చేశారు. బయటకు వచ్చాక మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాంటి వ్యక్తో పల్నాడు ప్రాంత ప్రజలందరికీ బాగా తెలుసని చెప్పారు. వినుకొండ ప్రజలకు ఎంతో మేలు చేసిన నాయకుడిగా మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ నలుగురికి సహాయం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదని గుర్తు చేశారు. ఫేక్ జీవోలు , వాటికి సంబంధించిన అక్రమాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారిలో బ్రహ్మనాయుడు అనుచరులు కూడా ఉన్నారని వివరించారు. నిజాలను బయటపెట్టిన వారిపైనే కేసులు నమోదు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అక్రమ అరెస్టు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. బ్రహ్మనాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే వేధింపులు జరుగుతున్నాయని వివరించారు. బొల్లా నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.


