బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అందుకు రెవెన్యూ అధికారులు సహకరించడంతో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు గత వారం రోజులుగా జోరందుకున్నాయి. గ్రామ రెవెన్యూ పరిధిలో వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించారు. ఆ కేంద్రానికి చుట్టుపక్కల సుమారు 15 అడుగుల లోతులో గత వారం రోజులుగా గ్రామానికి చెందిన ఇద్దరు అధికార టీడీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతూ యద్దనపూడి తదితర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో ఓ నాయకుడు తనకు గ్రావెల్‌ తవ్వకాల కోసం తహసీల్దార్‌ మౌఖిక అనుమతులు ఇచ్చారని చెప్పుకోవడం విశేషం.

నేనెవరో తెలుసా అంటూ..

విషయం తెలిసిన కూకట్లపల్లి రేంజ్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రమేశ్‌బాబు ఆదివారం మధ్యాహ్నం గ్రావెల్‌ తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడివారిని ప్రశ్నించారు. మొదట ఇది తమ పట్టా భూమి అని అనంతరం తహసీల్దార్‌ అనుమతులు ఉన్నాయని దబాయించే ప్రయత్నం చేశారు. పట్టా చూపమని రమేశ్‌బాబు, అడగ్గా వారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. అంతటితో ఆగక సదరు చోటా నాయకుడు నేనెవరో తెలుసా ఇప్పుడే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నా, మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రమేష్‌ బాబుతో వివాదానికి దిగాడు.

మరో వర్గం నాయకుల ఒత్తిడితో దాడులు

అధికార పార్టీలోని ఆధిపత్య పోరులో భాగంగా వీరిద్దరిని వ్యతిరేకించే మరో వర్గం నాయకులు తహసీల్దార్‌, వీఆర్వో, ఏఆర్‌ఏలను గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశించడం విశేషం. దీంతో తహసీల్దార్‌ ఆదేశాలతో ఇరువురు సిబ్బంది గ్రావెల్‌ తవ్వకాల వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్ర చెరువు భూమి అని తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్‌ తమను అక్కడికి పంపినట్లుగా వీఆర్వో తెలిపారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఫారెస్ట్‌ భూమిలో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ హెచ్చరించారు. తవ్వకాల కోసం ఒక పొక్లెయిన్‌, సుమారు 20 కి పైగా ట్రాక్టర్లు అక్కడ సిద్ధంగా ఉండటం చూస్తుంటే దీని వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా అంత బహిరంగంగా గ్రావెల్‌ తవ్వకాలు నిర్వహించే ప్రయత్నం జరగదని అర్థమవుతుంది. వారం రోజులుగా అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు జరిపి విక్రయించిన స్థానిక టీడీపీ నాయకుడు పల్నాడు జిల్లా గణపవరంలోని ఎంఎల్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో ట్రాక్టర్లకు సీరియల్‌ నంబర్లతో టోకెన్లు ముద్రించి అడ్డగోలుగా వ్యాపారం సాగించాడు.

టీడీపీలోని వర్గపోరుతో అధికారుల దాడులు

అప్పటివరకు మిన్నకుండిపోయిన యంత్రాంగం

Advertisement
 
Advertisement
Advertisement