కొల్లూరు: పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరు మండలంలోని దోనేపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దోనేపూడికి చెందిన నిమ్మగడ్డ దుర్గారావు (60) మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతి విపత్తుల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి తోడు, పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులతో సతమతమవుతూనే చేసిన అప్పులు తీర్చి, ఆర్ధికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్ధేశ్యంతో లారీ కొనుగోలు చేసి ఇసుక, ఇటుక, మెటల్ చిప్స్ రవాణా ద్వారా బ్రోకరేజ్ చేస్తూ వచ్చాడు. వ్యవసాయంలో వస్తున్న నష్టాలకు తోడు బ్రోకరేజ్లో సైతం నష్టాలు ఎదురవడంతో అప్పులు అధికమయ్యాయి. కొద్ది రోజులుగా తన భార్య వద్ద బాధను వెళ్లగక్కుతున్నాడు. ఎలాగోల కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య సర్ధిచెప్పింది. దుర్గారావు ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి కలుపు నివారణ మందును సేవించాడు. ఇది గమనించిన భార్య స్థానికులు, బంధువుల సాయంతో వైద్యశాలకు తరలించింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. వైద్యశాల నుంచి కొల్లూరు పోలీసులకు ఆదివారం అందిన మరణ నివేదిక మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు శవ పంచనామా నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.


