నకరికల్లు: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని అడ్డరోడ్డు గ్రామ సమీపంలో నరసరావుపేటరోడ్డులో శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన అక్కల పెదరామిరెడ్డి(40) ట్రాక్టర్ను బాగు చేయించుకునేందుకు గాను ట్రాక్టర్ నడుపుకొంటూ నరసరావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో అడ్డరోడ్డు సమీపంలో నరసరావుపేట రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపక్కనే గల పంటకాలువలో బోల్తాపడింది. దీంతో ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన పెదరామిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతునికి భార్య లక్ష్మీపద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


