సీసీ రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వలేదని అక్కసు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో స్వైరవిహారం మహిళకు తీవ్రగాయాలు
నరసరావుపేట రూరల్: మండలలలోని పమిడిమర్రులో కూటమి కార్యకర్తలు రెచ్చిపోయారు. రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాలం రమణమ్మ అనే మహిళ తలకు గొడ్డలి దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలో సీసీ రోడ్డు ఏర్పాటుకు బాధితుల స్థలం అడ్డుగా ఉండటంతో కూటమి నాయకులు బలవంతంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నించారు. వారు అడ్డుకోవడంతో మంగళవారం సర్వే అధికారులతో సర్వే చేయించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. రాళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో కూటమి నాయకులు వారిపై దౌర్జన్యానికి దిగారు. పురుషులు పొలం పనులకు, బయటకు వెళ్లిన సమయంలో మహిళలపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, గొడ్డళ్లతో బీభత్సం సృష్టించారు. సగినాల యలమంద, శ్రీనివాసరావు, జగ్గయ్యతో పాటు మరికొందరు దాడిలో పాల్గొన్నట్లు బాధితులు ఆరోపించారు. రమణమ్మ తలకు తీవ్ర గాయమైంది. ఆమెను నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాణభయంతో తమ కుటుంబాలు గ్రామాన్ని వదిలి బయటకు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయకుండా దాడికి పాల్పడిన వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. కూటమి కార్యకర్తల నుంచి తమ కుటుంబాలకు ప్రాణహాని ఉందని, ఉన్నతాధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.


