గుంటూరులో ఏపీటీఎఫ్ ధర్నా
12వ పీఆర్సీ కమిషన్ను నియమించి,
30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉగ్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం బ్రాడీపేటలోని గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవలింగారావు మాట్లాడుతూ ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపులో భాగంగా అన్ని పాత తాలుకా కేంద్రాల్లో ఉపాధ్యాయులతో ధర్నా చేపట్టామన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చడంలో సాచివేత ధోరణిని అవలంబిస్తూ ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, సీపీఎస్ బకాయిలు అరకొరగా చెల్లించి పండగ చేసుకోమనడం దారుణమన్నారు.
తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించి, మధ్యంతర భృతితో పాటు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు గత 20 నెలలకు పైగా గ్రాట్యుటీ చెల్లించలేదని, ఉద్యోగ విరమణ రోజునే అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు మంజూరు చేయడంతో పాటు నాలుగు పెండింగ్ డీఏలు చెల్లించాలన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే 10వ తరగతి పరీక్షలు ముగిసిన తరువాత అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రాష్ట్ర స్థాయిలో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.
ఏపీటీఎఫ్ జీఓ కమిటీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా మాట్లాడుతూ టెట్ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవిధంగా చట్ట సవరణ చేసేందుకు మార్చి 10న చలో ఢిల్లీ చేపట్టామన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ విద్యాశాఖాధికారుల విచిత్ర పోకడలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల సీఎస్, డీవోల నియామకంలో కొత్త పోకడలు అవలంబిస్తున్నారని, గతంలో ఎన్నడూ ఇన్విజిలేషన్ విధులను చేయనివారిని నియమించారన్నారు. జూనియర్లను కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్గాను, సీనియర్లను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు.


