అర్ధరాత్రి ఒంటి గంట నుంచే త్రికోటేశ్వరస్వామి దర్శనం
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ ● ఎస్పీతో కలసి ఏర్పాట్లపై సమీక్ష
నరసరావుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శనివారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భక్తులకు త్రికోటేశ్వరస్వామి దర్శనం ప్రారంభిచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లలో ట్రాఫిక్ నిర్వహణపై కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభలు ఉదయం 11గంటలలోపే కొండ వద్దనున్న ప్రభల ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. కొండపైకి 120 బస్సులు నడపాలని, షిఫ్టుల వారీగా సిబ్బందిని, అదనపు బస్సులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా పౌర రవాణా అధికారికి సూచించారు. నరసరావుపేట, చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే బస్సులకు ఆయా దారుల్లోనే వేర్వేరు బస్టాండ్లు ఏర్పాటు చేయాలని, డ్రోన్లు, సీసీ టీవీలతో కొండ ప్రాంగణం నిత్య పర్యవేక్షణ చేయాలని సూచించారు. కొండపై నిర్మించిన నూతన మొబైల్ టవర్ ట్రయల్ రన్ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఆర్టీఓ జి.సంజీవరావు, ఆర్టీసీ డీపీటీఓ జి.అజితకుమారి, ఆర్డీఓ కె.మధులత, డీఎస్పీ ఎం.హనుమంతరావు, తహసీల్దార్ వేణుగోపాలరావు, పలువురు జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూడండి


