ఏపీఆర్జే కళాశాలలో విద్యార్థుల ఘర్షణ
బైపీసీ, ఎంఈసీ గ్రూపులుగా విడిపోయి కొట్లాట ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య సోమవారం రాత్రి గ్యాంగ్వార్ జరిగిన ఘటన కలకలం రేగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఈ నెల7వ తేదీన కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో బైపీసీ, ఎంఈసీ విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదైంది. దీంతో సోమవారం రాత్రి మెస్లో భోజనాలు చేసేటప్పుడు మళ్లీ గొడవ మొదలైంది. లెక్చరర్లు, వార్డెన్ల సమక్షంలోనే విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో విజయపురిసౌత్కు చెందిన ఎంఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి జరపాల వెంకటేశ్వర్లునాయక్కు కంటికి తీవ్ర గాయమవ్వగా ఎంఈసీ విద్యార్థులు శ్రీనివాస్, చంద్రశేఖర్లకు తలకు బలమైన గాయాలయ్యాయి. కంటికి గాయమైన వెంకటేశ్వర్లు నాయక్ను విజయపురిసౌత్ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకై గుంటూరు శంకర కంటి ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలైన ఇద్దరు విద్యార్థులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ కళాశాలను సందర్శించి గొడవకు కారణం తెలుసుకొని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కళాశాలలో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి ఘర్షణలు పడడం, విద్యార్థులకు తీవ్రగాయాలై ఆస్పత్రుల పాలవడం తదితర ఘటనల్లో కళాశాల లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యం ప్రస్పుటంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఏపీఆర్జే కళాశాలలో విద్యార్థుల ఘర్షణ


