ఆకట్టుకున్న ‘ఆ ఊరు – ఈ ఊరు’
కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి.


