టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు
టీడీపీ సీనియర్ నాయకుడు సరిపూడి పార్టీ సభ్యత్వానికి రాజీనామా
పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని జలాలపురం గ్రామానికి చెందిన వ్యాపారి, సీనియర్ నాయకులు సరిపూడి రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. జలాలపురంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేశానన్నారు. గ్రామంలోనే టీడీపీకి చెందిన వారు నాపై హత్యాయత్నం చేసినా ఎమ్మెల్యే ప్రవీణ్ కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారే నాపై కేసులు పెట్టించారని తెలిపారు. పార్టీలో న్యాయం జరగదని భావించి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు ఏటుకూరి బ్రహ్మయ్యకు అందజేస్తామన్నారు. తనతోపాటు తన అనుచరులు కూడా త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.


