
పులిచింతలకు 2,04,138 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 11 క్రస్ట్ గేట్ల ద్వారా 2,04,138 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 11 క్రస్ట్ గేట్లు 3.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,04,138 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.33 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.963 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 59.80 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్ నుంచి 1,99,781 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.