
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడితే శంకర్నాయక్
మాచర్ల: ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడితే శంకర్నాయక్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1962లో ఎస్టీలకు కేటాయించిన రిజిర్వేషన్ను రద్దు చేయించి, మాచర్ల, కదిరి లాంటి నియోజక వర్గాలను జనరల్కు మార్చారని, దీని వల్ల మైదాన ప్రాంతంలో ఒక్క ఎస్టీ ఎమ్మెల్యే లేకుండా అన్ని వర్గాలు కుట్ర చేశాయనితెలిపారు. ఆదివారం గిరిజన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన రాష్ట్ర నాయకులు మండ్లి పెద్ద మల్లుస్వామి, నూన్సావత్ రంగా నాయక్, సైదా నాయక్, సర్పంచ్ శ్రీను నాయక్లతో కలిసి మాట్లాడారు. 2026లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. ఇందులో గిరిజన జనాభాను జిల్లాల వారీగా యూనిట్గా తీసుకొని తమ హక్కులకు భంగం కలిగించకుండా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనే పోరాటంలో భాగంగా మాచర్లలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా గిరిజనుల సమావేశాన్ని నిర్వహించి, విజయవాడలో లక్షలాది మంది గిరిజనుల హక్కులపై పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే గిరిజనులు రాష్ట్రవ్యాప్తంగా 12శాతం ఉండగా, ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇచ్చారని తెలిపారు. దీనిపై కుట్ర చేసి అభివృద్ధి చెందిన వడ్డెర, బోయ కులాలను ఎస్టీల్లో చేర్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజన, యానాది, ఎస్టీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల కోసం పోరాటం చేస్తామని వివరించారు. పల్నాడు జిల్లా మాచర్లలోని సమావేశం పునాది అని, పోరాటానికి నాంది అని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం విస్తరించేందుకు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.