ఎంఎండీఆర్ సవరణ బిల్లు
● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక డిమాండ్
రాయగడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన గనులు, ఖనిజాల అభివృద్ధి –నియంత్రణ (ఎంఎండీఆర్) సవరణ బిల్లును జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ఒడిశా రాష్ట్ర హక్కులు, ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రకలు అన్నారు. బిల్లును ఉపసంహరించుకోకపొతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. స్థానిక సర్క్యూట్ హౌస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ.. ఎలాంటి సమగ్ర చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఎంఎండీఆర్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిందని ఆరోపించారు. 2024లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖనిజాలపై పన్నులు, సెస్ విధించే హక్కు రాష్ట్రాలకు ఉన్నప్పటికీ.. తాజాగా సవరణ బిల్లు ద్వారా కేంద్రం ఆ హక్కులను పరిమితం చేసిందని ఆరోపించారు. సవరణ బిల్లు వల్ల ఒడిశా రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల రూపాయల బకాయి రాయల్టీపై ప్రభావం పడటంతో పాటు ఏటా రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉలక పేర్కొన్నారు. దీని ప్రభావం జిల్లా ఖనిజ ప్రతిష్టానాల నిధులపైనా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఆదాయ మిగులు రాష్ట్రంగా ఉన్న ఒడిశా భవిష్యత్లో ఆదాయలోటు రాష్ట్రంగా మారే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్, రాయి క్వారీలు, ఖనిజ భూములు వంటి రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయడానికి ఈ సవరణ మార్గం సుగమం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివాసీ ముఖ్యమంత్రిగా ఉన్న మోహన్ చరణ్ మాఝి ఈ బిల్లుకు ఎలా మద్దతు ఇస్తున్నార ని ఎంపీ ఉలక ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే ఒడిశా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎండీఆర్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ బి ల్లును కేంద్రం ఉపసంహరింకోకతోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ సాధారణ కార్యదర్శి సంకర్షణ మంగరాజ్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు నంది గౌరీ ఉన్నారు.


