● అనుగోల జిల్లాలో ఒకరు మృతి
భువనేశ్వర్: అనుగోల జిల్లాలోని పల్లొలొహడా మండలం పవిత్రాపూర్ పంచాయతీ సనబగడరి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. మరో 10 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడిని సుమంత్ సెఠిగా గుర్తించారు. అతడు జ్వరం, తల నొప్పి, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురయ్యాడు. తదుపరి దశలో చిగ్గర్ పురుగుల కాటు వల్ల కలిగే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్గా నిర్ధారణ అయింది. 10 మందికి పైగా వ్యాధిగ్రస్తులను చికిత్స కోసం ఖమర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ), ఇతర ఆరోగ్య కేంద్రాలలో చేర్పించారు. ఈ పరిస్థితి గురించి ఖమర్ సీహెచ్సీ వైద్య అధికారితో సంప్రదించినట్లు పల్లొలొహడా సబ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ సోకిన ఒక రోగి మరణించగా 4 నుంచి 5 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య అధికారి తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంది. చికిత్స పకడ్బందీగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. వ్యాధి సోకిన వారిని ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందన్నారు.
ఆరోగ్య శాఖ నిఘా
ఆరోగ్య శాఖ అనుగోల జిల్లాలో నిఘాను ముమ్మరం చేసింది. సందిగ్ధ రోగుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత గ్రామంలో చికిత్స, అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆరోగ్య బృందం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా సందర్శిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆరోగ్య శాఖ నిఘాను ముమ్మరం చేసింది
గడ్డి, పొదలు, ఆకులు, తదితర వృక్షసంపద ఉన్న ప్రాంతాల్లో కనిపించే చిన్న పేను లాంటి కీటకాల కాటు వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఇది జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులను కలిగిస్తుంది. అనుగోల ముఖ్య జిల్లా వైద్య అధికారి డాక్టర్ మదన్ మోహన్ ప్రధాన్ మాట్లాడుతూ సనబగడరిలో ఇప్పటి వరకు 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. వ్యాధి సోకిన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. పాజిటివ్గా తేలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు సమగ్ర సరంజామా అందుబాటులో ఉందని అభయం ఇచ్చారు. ఈ వ్యాధి కొత్తది కాదు. చాలా కాలంగా ఉంది. డయాగ్నస్టిక్ కిట్ల ద్వారా దీనిని గుర్తించవచ్చన్నారు. వర్షా కాలంలో చెప్పులు లేకుండా నడిచే వారిని టిక్ లాంటి కీటకాలు కుట్టడం వల్ల ఇది వస్తుందని ఆయన అన్నారు.


