భువనేశ్వర్: భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కుమారుడు అజిత్ సాహును స్థానిక నయాపల్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. రాజ్య సభ సభ్యుడు సుజీత్ కుమార్కు భూమి ఇప్పిస్తానని వాగ్దానం చేసి మోసం చేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో అజిత్పై ఒక ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆరోపిత మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. సమన్లు జారీ చేసినప్పటికీ అజిత్ పదేపదే కోర్టుకు గైర్హాజరు కావడంతో ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అతడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. తదనంతరం అతనిపై వారెంట్ జారీ చేసింది. వారెంట్ ఆధారంగా నయపల్లి ఠాణా పోలీసులు అతడిని భువనేశ్వర్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
బైకు చోరీ కేసులో
నిందితుడి అరెస్టు
రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బైకును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వ్యక్తి కాసీపూర్ పరిధిలోని రౌత్ఘాటి గ్రామానికి చెందిన హేమంత్ గౌడోగా గుర్తించారు. నిందితుడి నుంచి టివిఎస్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో
ఆర్.ఉదయగిరి వాసి మృతి
పర్లాకిమిడి: తెలంగాణలో హైదరాబాద్కు పొట్టచేతపట్టుకుని వలస వెళ్లిన కార్మికుడు ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసు అధికారులు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ అనుగురు పంచాయతీ తిలికోరో గ్రామానికి చెందిన బయాన్ రయితో (52) హైదరాబాద్లో రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అక్కడి స్థానికులు మెడికల్కు తరలించగా ఆయన మృతిచెందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బయాన్ రయితో మృత్యువార్త విని స్వగ్రామం తిలికోరో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి. ఆయన మృతదేహాన్ని ఎలాగైనా ఒడిషా తీసుకురావడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.
రూ. 1.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెల్టాయి కూడలి నుంచి బోడపోదర్ పంచాయతీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆటో అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. దీంతో అనుమానంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గమనించారు. 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహరంగ మార్కెట్లో లక్షన్నర రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ నగేష్ హంతాళ్పై కేసు నమోదు చేసి అరేస్టు చేశారు. పట్టుబడ్డ గంజాయిని చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ భత్ర సమీక్షంలో తూకం వేశారు.


