న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నవజాత శిశువుకు ..
భువనేశ్వర్: మహిళా, శిశు అభివృద్ధి శాఖ గురువారం రాష్ట్ర స్థాయిలో ప్రపంచ చనుబాల వారోత్సవాలు 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మహిళా, శిశు అభివృద్ధి శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ మృణాలిని దరస్వాల్ అధ్యక్షత వహించారు. విభాగం డైరెక్టర్ మోనిషా బానర్జీ స్వాగతోపన్యాసం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ దరస్వాల్ మాట్లాడుతూ చనుబాలు బిడ్డకు తొలి టీకా, అత్యంత పోషకమైన ఆహార వనరుగా పేర్కొన్నారు. చనుబాలు పట్టడం యొక్క ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. బిడ్డ శారీరక, మానసిక మరియు అభిజ్ఞా వికాసం కోసం, పుట్టిన గంటలోపే చనుబాలు పట్టడం ప్రారంభించాలని, తొలి 6 నెలల పాటు కేవలం చనుబాలు మాత్రమే పట్టేలా శ్రద్ధ వహించాలని తెలిపారు. బిడ్డకు రెండేళ్ల వరకు అనుబంధ ఆహారంతో పాటు చనుబాలు కూడా కొనసాగించాలని ఆమె చెప్పారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదల, సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడంలో తండ్రులు, కుటుంబ సభ్యుల కీలక పాత్రను ఆమె వివరించారు. ప్రపంచ వ్యాప్త లాభాపేక్షరహిత సాంకేతిక సంస్థ అయిన వధ్వానీ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై మొబైల్ ఫోన్ వీడియో ద్వారా పిల్లల బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత, మధ్య–పై చేయి చుట్టుకొలత (ఎంయూఏసీ)లను కొలవడానికి వీలు కల్పించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థ ప్రదర్శించారు.
కమిషనర్ ఈ చొరవను అభినందించి దాని కచ్చితత్వం, వినియోగం, సమర్థతను మెరుగుపరచడానికి కొన్ని మార్పులు సూచించారు. ఏఐ ఆధారిత పిల్లల పెరుగుదల పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రాలలో ఒడిశా కూడా ఒకటి కావడం గమనార్హం. బాల్యంలో సరైన పోషకాహారం, సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమానికి హాజరైన 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులను పోషకాహార పండ్ల బుట్టలు మరియు శిశు సంరక్షణ కిట్లతో సత్కరించారు. కార్యక్రమంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సీనియర్ అధికారులు, అధికారులు, సలహాదారులు కూడా పాల్గొని చనుబాలను ప్రోత్సహించడం, తల్లి మరియు పిల్లల పోషణను మెరుగుపరచడం, ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.


