పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ క్రిష్టియన్వీధిలో ఈనెల 5న జంపి రైతా వ్యాలెట్ బ్యాగు నుంచి 1.5 తులాల బంగారు నగ, చెవుల జుంకాలు, వేలాడే జిలికా (12 అణాలు) దొంగిలించిన కేసులో తన సమీప బంధువు మరిది సమీర్ లిమ్మా (28) అరెస్టయినట్లు ఆర్.ఉదయగిరి సబ్డివిజనల్ పోలీసు అధికారి అమితావ్ పండా తెలియజేశారు. ఆర్.ఉదయగిరి ఐఐసీ కల్పలతా ప్రధాన్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 5 బుధవారం ఆర్.ఉదయగిరి క్రిష్టియన్ వీధికి చెందిన జంపి రైతా తండ్రి ఆరోగ్యం క్షీణించిందనే సమాచారంతో భర్తలో కలిసి దగ్గరలో ఉన్న లుహాకుటి గ్రామానికి ఉదయం బయలు దేరారు. ఆమె తన బంగారు నగ, జుంకాలను తన బ్యాగులో వేసుకుని వెళ్లారు. అయితే లుహాకుటి గ్రామంలో తన తండ్రిని బాగోగులు పరామర్శించిన సమయంలో అక్కడ తన ఆడపడుచు బెత్లీ లిమ్మా, ఆమెభర్త సమీర్ లిమ్మా ఉన్నారు. తండ్రిని పరామర్శించిన తర్వాత తిరిగి తన స్వగ్రామానికి బయల్దేరుతుండగా తన వ్యాలెట్ దాచి ఉంచిన బ్యాగులో బంగారునగ, చెవుల జుంకాలు, పేట కనిపించకుండాపోయాయి. దీంతో ఆమె బంధువులకు అడిగిన అనంతరం అక్కడ తన ఆడపడుచు, మరిది సమీర్ లిమ్మా కనబడకపోవడంతో వారిపై జంపి రైతా అనుమానంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును వెంటనే దర్యాప్తుచేశారు. చివరకు పోలీసులు జంపిరైతా మరిది సమీర్ లిమ్మాను అరెస్టు చేసి దర్యాప్తు చేయగా దొంగిలించిన బంగారు నగ 18.75 గ్రాములు, చెవి జుంకాలు సెట్ 12 అణాలు నిందితుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు.


