మధుసూదన్ నగర్లో అత్యధిక వర్షపాతం
భువనేశ్వర్: రాజధాని భువనేశ్వర్తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి తెరిపి లేకుండా వాన కురిసింది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు సగటున 97.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి, ఇళ్లు జలమయమయ్యాయి. కటక్ నగరంలో కూడా అర్ధ రాత్రి నుంచి వర్షం కొనసాగుతోంది.
మధుసూదన్ నగర్లో అత్యధిక వర్షపాతం
నగరంలో మధుసూదన్ నగర్లో అత్యధికంగా 107 మిల్లీ మీటర్లు, నయాపల్లిలో 97.2 మిల్లీ మీటర్లు, జగ్మోహన్ నగర్లో 90.4, లక్ష్మీ సాగర్లో 90, షాహిద్నగర్లో 83.2, ఖండగిరిలో 73.2, ఖారవేల నగర్లో 59.4, చంద్రశేఖర్పూర్లో 50.34, పటియాలో 6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్ర స్థాయిలో తాల్చేర్లో అత్యధికంగా 80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ సమాచారం.
దక్షిణ ఒడిశాకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన వ్యవస్థ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గతంలో ఉత్తర ఒడిశాపై ప్రభావం చూపిన అల్పపీడన వ్యవస్థకు భిన్నంగా ఈసారి దక్షిణ ఒడిశా ప్రాంతాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కోనున్నాయి. ఈ వ్యవస్థ కదలికను బట్టి ఈ నెల 13 నుంచి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగవచ్చు అని స్థానిక ప్రాంతీయ వాతావరణ కేంద్రం సమాచారం.
మల్కన్గిరిలో కుండపోత వర్షం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం కుండపోత వాన కురిసింది. రోడ్డుపైకి వరద రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల కొండ చరియలు పడి రహదారులు మట్టితో నిండిపోయాయి.


