భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడితో నడి సముద్రం లోనికి కొట్టుకు పోయిన పర్యాటకులను ప్రాణాలతో కాపాడారు లైఫ్గార్డులు. సెక్టార్ 9 బీచ్ సమీపంలో ఆదివారం సముద్రంలో స్నానం చేస్తుండగా ముగ్గురు పర్యాటకులు అలల తాకిడిలో చిక్కుకున్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. సముద్ర తీరంలో పహారాలో నియమితులై ఉన్న లైఫ్ గార్డులు, అగ్ని మాపక సిబ్బంది తక్షణమే అలల మధ్యకు చేరి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న పర్యాటకులను సురక్షితంగా ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు.
యువకుడు అరెస్టు
మల్కన్గిరి: మొబైల్ ఫోన్లు దొంగిలించిన యువకుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2023లో బలిమెల పట్టణంలో మీనా బజార్ నిర్వహించారు. అక్కడ ఉన్న షెడ్లో ఓ వ్యాపారి వద్ద నుంచి మూడు ఫోన్లు ఎవరో దొంగిలించారు. బలిమెల మెడికల్ వీధికి చెందిన సంతోష్ నాగ్ అనే యువకుడు ఈ ఫోన్లు దొంగిలించినట్లు నేరం అంగీకరించడంతో అతడిని అరెస్టు చేశారు.
పేకాట శిబిరంపై దాడులు
పర్లాకిమిడి: ఆదర్శ పోలీసు స్టేషన్ సిబ్బంది జామి గ్రామానికి సమీపంలో కొండ ప్రాంతంలో నడుస్తున్న జూద శిబిరంపై దాడిచేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2500 నగదు, 3 మొబైల్ ఫోన్లు, రెండు మోటారు సైకిళ్లు, పేకపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట శిబిరంలో సుమారు 15 మంది ఉన్నారు. పోలీసుల రాకతో వారు పారిపోయినట్లు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. అరెస్టయిన వారిలో తేజేశ్వరరావు, అలియాన హాడ్డి (55), కటడ బసు (36) ను అదుపులోకి తీసుకుని ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.
రూ.100 కోట్లతో
వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్
జయపురం: జయపురం మునిసిపాలిటీలో వ్యర్ధ పదార్థాల నిర్వహణలో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమైన ప్రాజెక్టును నెలకొల్పనున్నట్లు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి శనివారం వెల్లడించారు. రూ.100 కోట్ల వ్యయం అంచనాతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఉందని తెలియజేశారు. అందుకు అధికారుల పరిధిలో సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆ ప్రాజెక్టు కోసం అవసరమైన 10 ఎకరాల స్థలం గుర్తించే కార్యక్రమంతోపాటు గుర్తించబడే ఆ స్థలం కేటాయించే ప్రక్రియ ప్రారంభమైందని బాహిణీపతి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాము జిల్లా కలెక్టర్ మనోజ్ మహాజన్తో చర్చించటం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జయపురం పట్టణ శివారులో 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వెంటనే 10 ఎకరాల స్థలం సమకూర్చాలని కలెక్టర్ జయపురం సబ్కలెక్టర్కు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల జయపురం పట్టణంలో వ్యర్ధాల నిర్వహణలో శాసీ్త్రయ మార్పులు వస్తాయన్నారు.


