పర్లాకిమిడి: ఆదివాసీ, హరిజన విద్యార్థులకు పోస్టు మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్పు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు గురువారం మధ్యాహ్నం ఆందోళన నిర్వహించారు. దాదాపు 200 మంది విద్యార్థులు రామగిరి నుండి బస్సుల్లో విచ్చేసి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లారు. గజపతి జిల్లా రామగిరి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ డిగ్రీ కళాశాల విద్యార్థులు పర్లాకిమిడి వచ్చి కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏటా ప్రభుత్వం రూ.7300 లు విద్యాభృతి అందజేసింది. కళాశాల ఫీజు రూ.7,500 లు ప్రభుత్వం మంజూరు చేసిన భృతి తమ ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యేది. అయితే ఏ కారణం చేతనో ఈ విద్యా సంవంత్సరంలో దాదాపు 400 మంది విద్యార్థులకు పీఎంఎస్ భృతి మంజూరుకు తిరస్కరించినట్టు ర్యాలీకి నాయకత్వం వహించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ రాయగడ కోఆర్డినేటరు ముఖలింగం పిడికాక తెలియజేశారు. అనంతం ఏబీవీపీ నాయకులు ముఖలింగం, విద్యార్థులు కొందరు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఎయిడెడ్ కళాశాల బీఆర్ అంబేడ్కర్ జాతీయ స్నాతక కళాశాలలో యూజీసీ నిబంధనల మేరకు ఎలాంటి లోపాలు ఉన్నా ఆయా కళాశాలలో భృతి మంజూరు చేయదని తెలిపారు. అందువలన విద్యార్థులకు ఈ ఏడాది పోస్టు స్కాలర్షిప్పులు మంజూరు చేయలేదని తెలిపినట్లు పేర్కొన్నారు.


