విజయనగరం క్రైమ్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటీ అగ్రహారం ప్రభుత్వ బాలికల వసతిగృహంలో మాక్సివిజన్ సహాయంతో బుధవారం నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది, వసతిగృహ సిబ్బంది పాల్గొన్నారు.
వయోజనులకు ‘ఉల్లాస్’ పరీక్ష
డెంకాడ: ఉల్లాస్ అక్షరాంధ్ర (2025–26) కార్యక్రమంలో భాగంగా మండలంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు వయోజనులకు ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం వి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల పరిధిలో 350 మంది వలంటీర్ టీచర్ల ఆధ్వర్యంలో 350 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3,498 మంది అభ్యాసకులు హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాలను డిప్యూటీ ఎంపీడీఓ రాజ్కుమార్తో కలిసి సందర్శించినట్లు చెప్పారు.
7న సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఎంపికలు
విజయనగరం: సీనియర్ పురుషుల జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 7న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో శనివారం ఉదయం 7 గంటలకు ఎంపికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఆధార్ కార్డుతో పాటు తెలుపు దుస్తులు ధరించి రావాలని తెలిపారు. ఆ రోజు జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులను ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందని, అర్హత, ఆసక్తి గల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డ్రోన్ వినియోగంతో డబ్బులు ఆదా..
డెంకాడ: పంటలకు డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడం ద్వారా సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతాయని మండల వ్యవసాయాధికారి టి. సంగీత తెలిపారు. మండలంలోని డెంకాడ గ్రామంలో పాణిరాజు పొలంలో మొక్కజొన్న పంటకు బుధవారం డ్రోన్తో పురుగు మందులను పిచికారీ చేయించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రోన్తో ఎకరా మొక్కజొన్న పంటకు 5 నుంచి 8 నిమిషాల్లో మందు పిచికారీ పూర్తవుతుందని చెప్పారు. కార్యక్రమంంలో ఏఈఓ బి.రామకోటి, రైతులు పాల్గొన్నారు.
వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలి
విజయనగరం ఫోర్ట్: వేసవి ప్రారంభమైన నేపఽథ్యంలో ప్రజలంతా వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. ఎండ తీవ్రత కారణంగా శరీర ఉష్ణోగ్రత 104.9 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరిగి మొదడుపై ప్రభావం చూపుతుందని దీనివల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించే మెదడు కేంద్రం దెబ్బతిని వడదెబ్బ సంభవిస్తుందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమై, ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు, ఫిట్స్ రావడం, అపస్మారక స్థితి ఎండలో బయటికి వెళ్లినప్పుడు కనిపిస్తే వెంటనే సమీప వైద్యున్ని సంప్రదించి ప్రధమ చికిత్స పొందాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడటం, తెలుపు రంగు, పలుచటి చేనేత వస్త్రాలు ధరించడం, తలకు టోపి, లేదా రుమాలు ధరించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదన్నారు.


