అవిశ్రాంత యోధులు!
వృద్ధుల సేవలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు
ఇంటి వద్దకే ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేత
తరచూ వైద్యశిబిరాల నిర్వహణ
సేవలు వినియోగించుకోవాలి
మావంతు సాయం
శ్రీకాకుళం కల్చరల్: వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా అవిశ్రాంతంగా సేవలు అందించిన వారు. ఉద్యోగ విరమణ చేశాక కూడా తమలాంటి వారికి చేయూతనందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా మంచానికే పరిమితమైన వృద్ధులు, నడవలేని వారికి అండగా ఉంటున్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్కు కీలకమైన జీవన ధ్రువపత్రం(లైఫ్ సర్టిఫికెట్)ను ఇంటి వద్దకే వచ్చి సక్రమంగా వివరాలు నమోదు చేసి ట్రెజరీకి పంపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో తాము బతికే ఉన్నామని ఒక గజిటెడ్ అధికారి చేత ధ్రువపరచి లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఏడాది చివరి వరకు వారికి నిరాటంకంగా నెలవారీ పింఛన్ మంజూరవుతుంటుంది. ఈ ప్రక్రియ ఆన్లైన్లోనే పంపేందుకు ట్రెజరీ శాఖ చర్యలు తీసుకుంది. అయితే కొంతమందికి ఈ ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో ట్రెజరీ కార్యాలయాల వద్దకు వెళ్లి నిరీక్షణలు చేయాల్సి వస్తోంది. అలాంటి వారికి రాష్ట్ర విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆసరాగా నిలుస్తోంది. గత ఏడాది 720 మందికి ధృవపత్రాలు చేయించింది. అందులో నడవలేని వారు, అనారోగ్యంతో ఉన్న 90 మందికి ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాలు చేయించారు. ఈ ఏడాది కూడా ధ్రువపత్రాలు చేయిస్తున్నారు.
పది రోజులకే గడువు..
లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించడానికి ఈ నెల 28వ తేదీతో గదువు పూర్తవుతుంది. ఇంకా ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్నా, మంచానికే పరిమితమైనా, అనారోగ్యంగా ఉన్నా 95022 49878, 94409 54954 నంబర్లను సంప్రదించవచ్చు. సంఘ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి ప్రక్రియ పూర్తి చేసేలా సహాయం అందిస్తారు.
సేవా కార్యక్రమాల్లో..
జీవన ప్రమాణ ధ్రువపత్రాలు చేయించడంతో పాటు సభ్యులకు అవసరమైన వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నాం. ఇటీవల పొన్నాడలో 30 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. పేద వృద్ధులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి తోచినంత సహాయం అందిస్తున్నారు. సంఘంలో 25 మంది సభ్యులు తమకు వస్తున్న పింఛన్లో రూ.4200 చొప్పున కేటాయించి క్షయరోగుల కోసం పౌష్టికాహారం అందించడానికి రెడ్క్రాస్కు రూ.1.05 లక్షలు విరాళంగా ఇచ్చారు.
పెన్షన్కు సంబంధించి విశ్రాంత ఉద్యోగులంతా నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికెట్ చేయించుకోవాలి. ఈ విషయంలో ఎటువంటి సహాయం కావాల్సి ఉన్నా సంఘాన్ని సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 28 వరకు మాత్రమే నమోదుకు గడువు ఉన్నందున ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
– ఎమ్మెస్సార్ ప్రకాష్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మావంతు చేతనైన సాయం చేస్తున్నాం. సంఘం నెలకొల్పిన దగ్గర నుంచి సేవలు అందిస్తున్నాం. నవంబరు, డిసెంబర్ నెలలో చేసిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు. ఈ విషయాన్ని గమనించి ఈ నెల 28లోపే లైఫ్ సర్టిఫికెట్ చేయించుకోవాలి.
– కల్లేపల్లి సోమసుందరరావు, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం
అవిశ్రాంత యోధులు!
అవిశ్రాంత యోధులు!


