స్మార్ట్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు
● మోసపోయిన ఐదురుగు టెన్త్ విద్యార్థులు
● కాశీనగర్లో ఘటన
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ స్మార్ట్ పబ్లిక్ స్కూల్ (ప్రైవేట్) నిర్వాకం వల్ల ఐదుగురు టెన్త్ విద్యార్థులు సి.బి.ఎస్.ఈ బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఐదుగురిలో కాశీనగర్కు చెంది కె.భీమరాజు కుమారుడు కె.అజయ్కుమార్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వీరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాశీనగర్ స్మార్ట్ పబ్లిక్ స్కూల్ సి.బి.ఎస్.ఈ సిలబస్తో విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు రాయించి పాస్ చేయిస్తామని నచ్చజెప్పింది. ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.25 వేల వసూలు చేశారు. వీరికి స్కూల్ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి సి.బి.ఎస్.ఈ రీక్షల్లో కూర్చో బెడతామని ప్రలోబపరిచారు. కాశీనగర్ స్మార్ట్ స్కూల్కు సి.బి.ఎస్.ఈ బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు రాకపోవడంతో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయడానికి అడ్మిట్ కార్డులు రాలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా ముఖ్య విద్యాధికారి మయాధర్ సాహు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కాశీనగర్లో ఉన్న స్మార్ట్ స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్కూల్కు ప్రభుత్వ యు–డైస్ కోడ్ను రద్దు చేయాలని డీఈఓను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మోసపోయిన వారిలో విద్యార్థులు కె.అజయ కుమార్, కె.జశ్వంత్, ప్రియదర్శి దళబెహరా, రోహిత్ పట్నాయక్ ఉన్నారు. టెన్త్ పరీక్షలు రాయకపోవడంతో ఒక విద్యా సంవంత్సరం పోగోట్టుకున్నామని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు.


