ఐద్వా ఆల్ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్
ఆటోనగర్(విజయవాడతూర్పు): బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్న మనువాద భావజాలం, మహిళా వ్యతిరేక భావజాలం, ద్వేషప్రచారానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి కనినిగా ఘోష్ బోస్ అన్నారు. శుక్రవారం ఆటోనగర్లోని ప్రయివేట్ రెసిడెన్సీలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనినిగా ఘోష్ బోస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బీజేపీకి చెందిన నాయకులు మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మహిళలు ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా సమస్యను లేవ నెత్తినా, బయటకు వచ్చి పోరాడినా సమాజం మొత్తం నాశనమైపోతుందన్నట్టుగా వారు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
పోరాటాలు కొనసాగుతాయి..
ఐద్వా ఆలిండియా అధ్యక్షురాలు పీకే శ్రీమతి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఐద్వా ప్యాట్రన్ నాయకురాలు సుభాషిణి ఆలీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం విషయంలో కూడా మార్పులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్. పుణ్యవతి మాట్లాడుతూ మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలలో 33 శాతం రిజర్వేషన్ విషయంలో పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామన్నారు.


