అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాపై కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలో అడ్డగోలుగా వేస్తున్న అక్రమ ‘లే అవుట్ల’పై ఈ నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో వెలువడిన ‘ఆయన చెబితే అంతా సక్రమమే’ అనే కథనానికి కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర స్పందించారు. అక్రమ లే అవుట్లపై విచారణ చేసి చర్యలు చేపట్టాలని సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో టౌన్ప్లానింగ్ టీపీఓ రిజ్వానా, అజిత్సింగ్నగర్ సీఐ చంద్రశేఖర్ సహకారంతో శుక్రవారం న్యూఆర్ఆర్పేటలోని అక్రమ లేఅవుట్లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు పోసి, ప్లాట్లు వేయడాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు.


