ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఢిల్లీలోని ఏపీ భవన్లో పురాతన శివాలయం, అమ్మవారి మందిరాన్ని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పరిశీలించారు. ఢిల్లీకి వెళ్లిన ఈవో, ఏపీ భవన్ పరిసరాల్లో ఉన్న ఆలయాలను పరిశీలించారు. కొన్నేళ్లగా ఈ రెండు ఆలయాలు అనధికార వ్యక్తుల చేతుల్లో ఉండగా, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆలయాలను దుర్గగుడి దేవస్థానానికి అప్పగించగా, దానిని ఈవో పరిశీలించారు. ఆయా ఆలయాల్లో శాశ్వత అర్చకుడిని నియమిస్తామని, అంత వరకు కనకదుర్గాదేవి మందిరంలో అర్చకుడికి బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలిపారు. కాగా ఆయన మంగళవారం వరకూ ఢిల్లీలోనే ఉండనుండటంతో విజయవాడ దుర్గగుడి ఇన్చార్జి ఈవోగా డీఈవో కిషోర్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.


