బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో విద్యావ్యవస్థ ప్రక్షాళనకు పోరాడుతున్న విద్యార్థులను అణచివేసే చర్యలు మానుకోవాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఎన్ఈపీ–2020, నీట్, ఎన్టీఏలను రద్దు చేయాలని, విద్యార్థి ఉద్యమాలపై వేధింపులు ఆపాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో నిరసన దీక్ష జరిగింది. జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన నిరసన దీక్షకు రాజేంద్ర ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు నెలలుగా విద్యార్థులు దేశ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని, విద్యార్థుల పక్షాన నిలబడి వారి డిమాండ్లు వినాల్సిన పాలకులు వారిని దేశ ద్రోహులనడం తగదన్నారు. విద్యార్థుల ఉద్యమానికి న్యాయవాదులుగా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఎన్టీఏ అసమర్ధత వల్ల ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని, తక్షణమే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం వల్ల ఇప్పటికే 90 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని, లక్షలాది మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివ, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షష్ఠి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ్, ఉపాధ్యక్షురాలు ప్రణీత పాల్గొన్నారు.


