లబ్బీపేట(విజయవాడతూర్పు): దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 28వ తేదీ తెలుగు వెలుగు సంబరాలు పేరిట సాంస్కృతిక పండుగను నిర్వహించనున్నట్లు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీ రాజు రాంప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన హరియాణ, పంజాబ్లలో నివసిస్తున్న తెలుగువారి కోసం సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా శనివారం ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు వెలుగు సంబరాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీ రాజు రాంప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి, ప్రవాస తెలుగు వారిని ఏకం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ సంస్థ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సభకు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధ్యక్షత వహించనున్నారని తెలిపారు.
పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అవార్డ్స్ కమిటీ చైర్మన్ కంతేటి వెంకటరాజు, సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్పీఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


