రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యుర్ విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, ఇతర అధికారులతో కలసి శనివారం కొవ్వూరు, గోదావరి స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలపై సమగ్ర తనిఖీ చేశారు. ముందుగా రాజమండ్రి స్టేషన్లో జరుగుతున్న స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గోదావరి, కొవ్వూరు స్టేషన్లను తనిఖీ చేసి పుష్కరాలకు తరలివచ్చే భక్తుల రద్దీ నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. రైల్వేస్టేషన్ల నుంచి నదీ తీరానికి మధ్య యాత్రికుల రాకపోకలను అంచనా వేసేందుకు పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద్ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్లతో సహా ప్రధాన స్నాన ఘాట్లను తనిఖీ చేశారు. అనంతరం రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది ప్రయాణికుల భద్రత, జన సమూహ నిర్వహణ వ్యూహాలు, అత్యవసర వైద్య ఏర్పాట్లపై సమీక్షించారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికులను సమర్థంగా నిర్వహించేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుందని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్కే రాజ్కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఏకే సిన్హా తదితరులు పాల్గొన్నారు.


