ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్.కోటేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం హనుమాన్పేటలోని తానా భవన్లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ‘బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ‘ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. కోటేశ్వరరావు మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పోలీసులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపన సభ్యులు, బాలల సేవలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఫాదర్ థామస్ కోషి మాట్లాడుతూ సమాజ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, గ్రామ, వార్డు స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బాలల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడాన్ని వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల రంగంలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ఇతర భాగస్వాములు ముందుకు రావాలని కోరారు. బాలల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం ‘బాలల భద్రత – అందరి బాధ్యత ‘ అనే పోస్టర్ను ఆవిష్కరించారు. చర్చావేదికలో హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతోష్, జె.ఎల్.వి. ప్రసాద్, పి.రత్నం, కాజా చంద్ర, ఫ్రాన్సిస్ తంబి, శారద, అనిల్ కుమార్, జోన్స్ మానికొండ, ఆర్ఎస్ రాజు పాల్గొన్నారు.


