న్యూస్రీల్
ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇవ్వండి లేదంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఎన్టీఆర్ జిల్లాలో శనివారం వరకు 83.16 శాతమే డిజిటలైజేషన్ ‘సర్’ గడువును పొడిగించాలని పలు వర్గాల నుంచి డిమాండ్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
ఓటు.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి అత్యంత విలువైన హక్కు. దాన్ని కొనసాగించుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను నింపి గడువులోగా తిరిగి వారికి అందజేయాల్సి ఉంది. ఇందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఓటరన్నా మేలుకో.. ఐదేళ్ల భవిష్యత్తును మార్చే ఓటు అనే ఆయుధాన్ని నీ చేతిలో ఉంచుకో.. త్వరపడు.
సాక్షి, విజయవాడ/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటు హక్కును కాపాడుకోవడానికి ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వీటిని పూర్తి చేసి తిరిగి వారికి అందించాలి. దీనికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. లేదంటే ఓట్లు గల్లంతయ్యే చాన్స్ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కార్పొరేషన్తో పాటు పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో సాంకేతిక సమస్య (సర్వర్ డౌన్) కారణంగా ఆలస్యమవుతోందని సచివాలయ సిబ్బంది నుంచి వినిపిస్తోంది. గడువు సమీపిస్తుండటంతో వీలైనంత ఎక్కువ శాతం డిజిటలైజేషన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నా ఆ స్థాయిలో జరగడం లేదు.
పట్టణాల్లోనే ఎక్కువ సమస్యలు..
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ కార్పొరేషన్తో పాటు ఇబ్రహీంపట్నం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర పట్టణ ప్రాంతాల్లో ఫారాలు సమర్పించని వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బీఎల్వోలకు వారి చిరునామాలు వెదికే పనిలో ఉన్నారు.
జిల్లాలో ఇంకా 2.84 లక్షలకు పైగా పెండింగ్
ఎన్టీఆర్ జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 17,09,204 ఫారాలు పంపిణీ చేశారు. శనివారం వరకు 14,24,982 (83.16 శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 2,84,222 (16.84శాతం) ఫారాలు పెండింగ్లో ఉన్నాయి.
రెండు రోజులు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
‘సర్’ వేగవంతం చేయడానికి 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు. మిగిలిపోయిన వాళ్లంతా వచ్చి ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు అందిస్తే డిజిటలైజేషన్ పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా అసలు ఫారాలే అందనివారు, తిరిగి సమర్పించని వాళ్లను ఈ రెండు రోజుల్లో మరోసారి వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా సందేహం వస్తే 1950 టోల్ఫ్రీ నంబర్కు చేసి నివృత్తి చేసుకోవాలని చెబుతున్నారు.
గడువును పొడిగించాలని డిమాండ్
ఈ నెల 14వ తేదీ కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో సర్ ప్రక్రియను పొడిగించాలని పలు ప్రజాసంఘాలు, పలు యూనియన్ల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సర్ ప్రక్రియ గడువు పొడిగించే అవకాశాలు లేవని ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో రెండుచోట్లా ఓటు హక్కు ఉన్నవారు ఒకచోట మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరి కావడంతో రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఫైనల్గా ఎన్ని ఓట్లు ఉంటాయనే దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
టైమ్ లేదు.. ఫారాలు ఇచ్చేస్తేనే ఓటు
ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. బీఎల్వోలు మరోసారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఇంకా ఫారం తీసుకోని వారిని, తీసుకుని ఇవ్వని వారి కోసం వెతుకుతారా ? అంటే ప్రస్తుతం కష్టమే. ఎందుకంటే డిజిటలైజేషన్ ప్రక్రియ చాలా కీలకం. సర్వర్ సమస్యతో రాత్రి వేళ కూడా ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి వస్తోందని పలువురు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
జిల్లా తాజా సమాచారం
నియోజకవర్గం శాతం డిజిటలైజేషన్
చేసిన దరఖాస్తులు
విజయవాడ వెస్ట్ 78.79 2,02,479
విజయవాడ సెంట్రల్ 79.60 2,21,148
విజయవాడ ఈస్ట్ 80.58 2,17,346
మైలవరం 85.05 2,42,539
నందిగామ 85.69 1,77,791
జగ్గయ్య పేట 85.95 1,78,397
తిరువూరు 88.78 1,85,282
కొన్నిచోట్ల డిజిటలైజేషన్ గందరగోళమైంది. కొత్త ఫొటోలు ఇవ్వాలని ఆదేశాలున్నా తుది దశకు వచ్చేసరికి పాతవి అలానే ఉంచేసి డిజిటలైజేషన్ చేసేస్తున్నారు. ఇదేమిటని బీఎల్వోలను అడిగితే పై నుంచి ఆదేశాలు అంటున్నారు. ఇంకొందరు ఫారాలు ఇవ్వకుండానే తమ వద్ద ఉన్న వివరాలతో డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సుమారు 10 డివిజన్లలో ఒక్కో బూత్లో 200 నుంచి 300 మంది అడ్రస్లు దొరకడం లేదు. వీరి ఫారాలు ఇంకా బీఎల్వోల వద్దనే ఉన్నాయి. ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదన్న ఉద్ద్ధేశంతో వారి వివరాలను ముందు ఆన్లైన్ చేసేస్తున్నారు. ఓటర్ల జాబితాలో ప్రతి ఓటును కాపాడుకోవాల్సి ఉంది.


