విద్యార్థులకు సమస్యల స్వాగతం దిక్కుతోచని స్థితిలో సర్కార్ స్కూళ్లు మధ్యలో ఆగిన అభివృద్ధి పనులు దాతల కోసం ఎదురు చూపులు ముగిసిన వేసవి సెలవులు.. నేడు పాఠశాలలు ప్రారంభం
జిల్లాలో
విద్యార్థులకు అవస్థలు
ప్రభుత్వ పాఠశాల
సర్కారీ స్కూళ్లలో
వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ కృషి ఫలితంగా సాధించిన విజయాలను తమవిగా పాలకుల గొప్పులు చెప్పుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
రూ.10.50 కోట్లు లేక
రెండేళ్లుగా నిలిచిన 364 తరగతి గదులు
ఎన్టీఆర్ జిల్లాలో నాడు–నేడు పనుల్లో భాగంగా పది శాతం పనులు పూర్తి చేస్తే సుమారు 364 తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును ‘మనబడి – మన భవిష్యత్’ అంటూ మార్చేసింది. కానీ ఒక్క రూపాయి సైతం విడుదల చేయలేదు. జిల్లాలో ఈ రెండో విడత పనులకు సుమారుగా రూ.10.50 కోట్లు అవసరం కానున్నాయి. వీటి కోసం జిల్లాలో విద్యాసంస్థలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. అయినా పాలకుల్లో స్పందన లేదు.
రూ.189 కోట్లతో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు
ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎయిడెడ్ మినహాయిస్తే సుమారుగా 863 పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాసంస్థలతో పాటుగా ఇతర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వాటిల్లో రెండేళ్లగా ఎటువంటి పనులు చేపట్టకపోవటంతో వేలాది సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి సుమారుగా రూ.189 కోట్లు నిధులు అవసరమవుతాయని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది.
ఎదురు చూపులు
రాష్ట్ర ప్రభుత్వం వసతుల ఏర్పాటుకు దాతలను చూడాలంటూ అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. విద్యాంజలి యాప్ ద్వారా దాతలను గుర్తించి ప్రోత్సహించాలంటూ సర్వశిక్ష అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు– నేడు పనుల్లో భాగంగా విజయవాడ కుమ్మరిపాలెంలోని దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పురాతనం కావటంతో పడగొట్టి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునాదులు పడే సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా స్థానిక నేతల ఆందోళనలతో.. దానికి దాతలను చూసే పనిలో కూటమి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వసతుల ఏర్పాటుకు నిధులు లేవు
విద్యార్థుల భవిష్యత్తు అంధకారం
పూర్తికాని అదనపు గదులు
జిల్లాలో వివిధ విద్యాసంస్థల్లో అనేక సమస్యలు తిష్ట వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాలు ఆయా పాఠశాల్లో ఉన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయులను ఇటీవల సమాచారాన్ని కోరాయి. అందులో చాలా పాఠశాల్లో విద్యార్థులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ఉన్నవి చాలడం లేదని, సరిపడా మంచినీటి వసతులు లేవని, అలాగే ఇతర మౌలిక సదుపాయలపై పలు వినతులను వివరించారు.


