ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను కలెక్టర్ ప్రారంభించారు. 20 మండలాల్లోని విద్యాసంస్థలు సాధించిన విజయాలను వివరిస్తూ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేశారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, సౌకర్యాలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా విద్యా ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 31 మంది విద్యార్థులు 580 పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.రమేష్ బాబు, డెప్యూటీ డీఈవోలు డి.సాంబశివరావు, జి.గుర్నాథం, ఎ.శ్యాంసుందర్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాకు చెందిన మండల విద్యా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


