వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండేళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు వెన్నుపోటు పేరుతో ఈ నెల 4 నుంచి 12 వరకూ వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చంద్రబాబుకు సెగ తగిలేలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో చేపట్టే నిరసన ర్యాలీల్లో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు అసమర్థ పాలన, అక్రమాలు, ఎన్నికల హామీలు విస్మరించడం వంటి అంశాలను ప్రశ్నించడానికి ర్యాలీలను విజయవంతం చేద్దామని ఆయన పేర్కొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: బందరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గురువారం కీలక నియామకాలు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ తెలిపారు. నూతన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ)గా కంటి వైద్య నిపుణులు జి. భానుమూర్తి, అసిస్టెంట్ ఆర్ఎంఓలుగా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్, డాక్టర్ నాగలక్ష్మిని నియమించామన్నారు.


