గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఇలక్కియ డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు.
మొత్తం 131 అర్జీలు..
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మొత్తం 131 అర్జీలు అందాయని జేసీ తెలిపారు. వీటిలో ఎంఏయూడీకి 37, రెవెన్యూ 28, పంచాయతీరాజ్ 19, పోలీస్ 16, హౌసింగ్ 4, వ్యవసాయం 3, విభిన్న ప్రతిభావంతులు 3, డీఆర్డీఏ 3, విద్య 3, ఏపీసీపీడీసీఎల్ 2, పౌర సరఫరాలు 2, మైన్స్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, గ్రామీణ నీటిసరఫరా 2 అర్జీలు రాగా వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్, దేవదాయ, ఇరిగేషన్, రవాణా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు.
హెచ్పీవీ వ్యాక్సిన్ పోస్టర్ల ఆవిష్కరణ..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో జేసీ ఇలక్కియ.. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వివిధ శాఖల అధికారులతో కలిసి హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు నివారించదగిన మరికొన్ని క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వేస్తున్నారన్నారు. ఈ జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు పాల్గొన్నారు.


